మధుమేహ వ్యాధి
మధుమేహ వ్యాధిని - చెక్కర వ్యాధి, షుగర్ వ్యాధి అని సాధారణంగా అంటూ వుంటారు.
కారణాలు
- శరీరములో ఉత్పత్తి అయే ఇన్సులిన్ హార్మోను - శరీరములోని షుగర్ ను సమతుల్యము చేసి, అవసరానికి షుగర్ అందుబాటులో వుండునట్లు చేయుటలో ఇన్సులిన్ ప్రధానపాత్ర వహిస్తుంది.
- శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గినచో - మధుమేహం వస్తుంది.
- ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను శరీరంలోని కణాలు సరిగా వినియోగించుకోక పోవడం వలన - మధుమేహ వ్యాధి వస్తుంది.
సాధారణంగా మధుమేహం ఎవరికి వస్తుంది?
- అధిక బరువు వున్న వాళ్ళు - చిన్నవారైన - పెద్దవారికైన రావచ్చు.
- మానసిక వత్తిడికి లోనైనవారు.
- శారీరక శ్రమ లేనివారికి (sedentary jobs).
- కొన్ని సందర్భాలలో - వారసత్వంగా కూడా ఈ వ్యాధి రావచ్చును.
- అవసరమైన మోతాదులకన్నా - ఎక్కువగా ఆహారము తినేవాళ్ళకు.
- తరచుగా జబ్బులతో బాధపడువారు రోగనిరోధక శక్తిని కోల్పోయి - మధుమేహ వ్యాధి రావచ్చును.
- కొన్ని రకాల మందులు దీర్ఘకాలం వాడడం వలన ఈ వ్యాధి రావచ్చును.
మధుమేహ వ్యాధి లక్షణాలు
- ఆకలి ఎక్కువగా వుండి - చాలా మార్లు, ఎక్కువగా ఆహారం తీసుకోవడం
- సాధారణంకన్నా ఎక్కవగా నీరు దప్పికకావడం - ఎక్కువగా నీరు త్రాగడం
- ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్ళడం.
- కొంతమందిలో బరువు తగ్గడం, గాయం తగిలినచో సరిగా మానకపోవడం - త్వరగా తగ్గకపోవడం.
- నీరసంగా, నిస్త్ర్రాణంగావుండడం, స్త్ర్రీలలో అసాధారణంగా తెల్లబట్ట(white discharge) కావడం
- తరచుగా చర్మవ్యాధులు రావడం
- కొందరిలో కాళ్ళు - చేతులు ముఖ్యంగా పాదాలు అరచేతులు తిమ్మిరిగా వుండడం.
- ఏదైనా పని చేయాలన్న - చికాకు, అసహనము కలిగి త్వరగా అలసిపోవడం, వంటి లక్షణాలలో ఏ లక్షణాలైనా వుండవచ్చును.
మధుమేహం వలన ఎక్కువ శాతం అన్ని అవయవాలకు అనారోగ్యం కలిగే అవకాశం వుంది.
ముఖ్యమైన అవయవాలు:-
- మూత్ర పిండాలు
- గుండె
- రక్త నాళాలు
- కళ్ళు - కంటిలో రక్త నాళాలు, నరాలు
- కాళ్ళు, పాదాల నరాలకు మధుమేహప్రభావం కారణంగా - గాయం అయినా, పుండు అయినా - మానకపోవడం లేదా నిదానంగా మానడం జరుగుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు:-
- వీలైనంత త్వరగా లక్షణాలను గుర్తించి, ఏ రకమైన మధుమేహమో, నిర్ధారించుకోవలసిన అవసరం వుంది - డాక్టరును సంప్రదించి వ్యాధినిర్ధారణ, వైద్యం చేయించుకోవడం ప్రధానము.
- శరీర కష్టం చేయనివారు, క్రమంతప్పక వ్యాయామం (అంటేనడక) చేయాలి. ప్రతిరోజు సుమారు 30 నిమిషాలు జోరుగా నడవాలి (Brisk walk). కనీసం వారంలో 5-6 రోజులు నడక వ్యాయామం చేయాలి.
- బరువులు ఎత్తడం లాంటి ప్రమాదకర వ్యాయామం చేయరాదు.
- పాదరక్షల అడుగుభాగము మెత్తగా స్పాంజిలాగా వుండే విధంగా చూడాలి.
- పాదాలు ఎల్లప్పుడు శుభ్రంగా వుంచుకొని - వీలైనప్పుడు డాక్టరును సంప్రదించి రక్తపరీక్షలు -మూత్రపరీక్షలు చేయించుకోవాలి.
- క్రమం తప్పక వైద్యం చేయించుకోవాలి.
- మితంగా అహారం తీసుకోవాలి.
- "కడుపు నిండకూడదు - ఖాళీ వుండకూడదు" అన్న నానుడికి అనువుగా ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి.
ఆహారంలో తీసుకోవలసిన పదార్ధాలు
ఆకుకూరలు, వంకాయ, బెండ, కాకర, పొట్ల, కాబేజి, దొండకాయ, మునగకాడలు, టమాట, కాలిఫ్లవర్ మొదలగునవి -
ఆహారములో తీసుకోకూడని పదార్ధాలు
పంచదార, తీపిపదార్ధాలు, బెల్లం, జీడిపప్పు, బాదం, కొబ్బరి నీళ్ళు, హార్లిక్స్ లాంటి పొడి పదార్ధాలు, అరటి, మామిడి, సపోటా, సీతాఫలం, ద్రాక్షవంటి పండ్లు, బిస్కట్లు, చాక్లెట్, కేకులు మొ"నవి, బంగాళాదుంప, నెయ్యి, ఇతర నూనె పదార్ధాలు.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
చర్మం- ప్రత్యేకమైన జాగ్రత్తలు ఎందుకు అనగా గ్లూకోస్ రక్తంలో ఎక్కువ మోతాదులో ఉన్నందున సూక్ష్మ క్రిములు (అనగా బాక్టీరియా) ఫంగస్ ఎక్కువ ఉత్పత్తి అవడం జరుగుతుంది. సామాన్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేందువలన సూక్ష్మ క్రిములతో పోరాడే శక్తి తక్కువగా ఉంటుంది.
- అందు వలన చర్మం ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి
- చర్మం రంగు మారినా, మందంగా ఉన్నా
- చర్మంపై బొబ్బలు ఉన్నా
- చర్మం ఎర్రగా వాపు ఉండి, వేడిగా ఉన్నా ఇది చర్మం ఇన్ ఫెక్షన్ అయి ఉండవచ్చు
- గజ్జలలో దురద, స్త్రీ మర్మాంగ అవయవాలలో, చంకలలో, కాలి వేళ్ళ మధ్య దురదలు ఎక్కువగా ఉన్నా
- దెబ్బ తగిలి మానకుండా ఉన్నా
వెంటనే డాక్టర్ సలహా పొందాలి (చర్మవ్యాధి డాక్టర్ )
- ప్రతి రోజూ క్రమం తప్పకుండా గోరు వెచ్చని నీళ్ళతో సున్నితమైన సబ్బు వాడి స్నానం చేయాలి, మరిగే నీళ్ళు వాడరాదు.
- స్నానం అయిన తరువాత మెత్తటి శుభ్రమైన పొడి బట్టతో తడి అంతా తుడుచుకోవాలి, శరీరం పై ఎక్కడా చెమ్మ ఉండరాదు. ప్రత్యేకంగా చర్మం ముడతలలో, తడి ఉన్నచో చర్మం దురదతో గోకినచో బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ రావచ్చు.
- ఎక్కువ నీరు త్రాగటం అలవాటు చేసుకోవాలి, చర్మం ఎండిపోయినట్లు ఉండరాదు.
మధుమేహ వ్యాధిగ్రస్ధులు – తీసుకొవలసిన ఆహారం
- నీరు కావలసినంత మోతాదు ( రోజుకు సుమారు 8 గ్లాసులు )
- వీరు తీసుకొనే ఆహారంలో పిండి పదార్ధాలు తక్కువగా ఉండి సంపూర్ణ ఆహారమై ఉండాలి
- వీరు తీసుకొనే ఆహారం వారి చికిత్స పై ఆధారపడి ఉంటుంది
మధు మేహ వ్యాధిగ్రస్ధులు తినకూడని ఆహార పదార్ధాలు
- దుంప కూరలు (ఉదా: బంగాళ దుంప, చామ దుంప )
- చాక్ లేట్లు, తీపి పదార్ధాలు, పుడ్డింగులు
- నూనెలో వేపిన పదార్ధాలు
- డ్రై ఫ్రుట్స్ ( పండ్లు) (ఉదా: ఎండు ద్రాక్ష, అంజీరా )
- చక్కెర
- అరటి పండు, సపోటా, సీతాఫలము (కస్థడ్డ్ ఆపిల్)
వీరు తీసుకొనే ఆహారంలో ముఖ్యంగా ఈ క్రింద చూపబడినవి తగు పాళ్ళలో ఉండాలి : ఉదాహరణకు
పదార్ధాలు |
( గ్రా )
|
( గ్రా )
|
గింజ ధాన్యాలు |
200 |
250 |
పప్పు ధాన్యాలు |
60 |
20 |
ఆకు కూరలు |
200 |
200 |
పండ్లు |
200 |
200 |
పాలు |
400 |
200 |
నూనెలు |
20 |
20 |
చేపలు/ కోడి మాంసము చర్మం లేకుండా |
- |
100 |
మిగతా కూరగాయలు |
200 |
200 |
మొత్తం కాలరీస్ |
1600 |
మాంసకృత్తులు |
65gs |
కొవ్వు |
40gs |
పిండి పదార్ధాలు |
245gs |
పైన ఇవ్వబడిన ఆహారం రోజులో ఎలా విభజించి తీసుకోవాలి
పదార్ధాలు |
శాకాహారులు |
మాంసాహారులు |
కాఫీ /టీ |
1 కప్పు |
1 కప్పు |
ఉదయం – టిఫిన్ |
ఉ: ఇడ్లీ- 2 |
ఉ: ఇడ్లీ- 2 |
కాఫీ /టీ |
1 కప్పు |
1 కప్పు |
మధ్యాహ్న భోజనం |
2 కటోరీలు |
2 కటోరీలు |
టీ / కాఫీ |
1 కప్పు |
1 కప్పు |
రాత్రి భోజనం |
|
|
నిద్రకు ముందు పాలు |
1 కప్పు |
1 కప్పు |
మధుమేహం - జాగ్రత్తలు
మధుమేహం తియ్యటి శత్రువు. చాప కింద నీరులా చల్లగా మన ఒంట్లోకి చేరిపోతుంది. ఏమరుపాటుగా ఉంటే జీవితంలోని తీపిని దూరం చేసి చేదును మిగులుస్తుంది. ఈ స్వీట్ ఎనిమీ దరిదాపుల్లోకి రానేవద్దు అనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇప్పటికే ఈ ఎనిమీతో పోరాడుతున్న వారు దానిమీద పైచేయి సాధించాలంటే ఏం చేయాలి ? వీటి మీద సమగ్ర వివరణే ఈ ముందు జాగ్రత్త.
ప్రాణాపాయం కలిగించే అంటువ్యాధుల్లో టి.బి అత్యంత ప్రమాదకరమైనది. అంటువ్యాధి కాని జబ్బుల్లో డయాబెటిస్ ప్రమాదకరమైనది. ఈ రెండు వ్యాధులు మన దేశంలో చాలా ఎక్కువ. డయాబెటిస్ వచ్చినవారిలో అందరూ అనుకునేటట్టుగా గుండె, కిడ్నీలు దెబ్బతినడం ప్రాణాపాయం అనుకుంటారు. కాని డయాబెటిస్ వచ్చినవారికి టి.బి లాంటి పెద్ద ఇన్ఫెక్షన్ల కారణంగానే ఎక్కువ మందిలో ప్రాణాపాయం సంభవిస్తుంది. ఈ విషయం మన దేశంలో ఎన్నో డయాబెటిస్ పరిశోధనల్లో వెల్లడైంది.
నేషనల్ అర్బన్ డయాబెటిస్ సర్వే 2001 లో హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ, ముంబయ్, మద్రాస్ నగరాలలో ( 5288 పురుషులు, 5929 స్ర్తీలపై) మధుమేహుల సంఖ్య ఎంతగా ఉందో తెలుసుకోవడానికి ఓ సర్వే నిర్వహించింది. మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్లో పాతికేళ్లు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరికి మధుమేహం ఉన్నట్టుగా వెల్లడైంది. ఇక నలభై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల మధ్య వయసు వారిలో 50 శాతం మందికి ఈ వ్యాధి ఉందని తెలిసింది. పదేళ్లతో పోల్చి చూస్తే ఇప్పుడు ఈ సంఖ్య ఎంతగా పెరిగి ఉంటుందో ఊహించవచ్చు. మధుమేహం లేనివారు నాకు ఈ జబ్బు లేదు కదా! అని నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఏ వయసులోనైనా, ఎవరికైనా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణాలు కనిపెట్టి , తగినంత శ్రద్ధ వహిస్తే ఈ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు.
డయాబెటిస్ నివారణ కోసం ముందు జాగ్రత్తలు
పంటి జబ్బులు: పంటికి-మధుమేహానికి ఏమిటి లింకు ? పంటి వ్యాధులు డయాబెటిస్కు ఎలా కారణం ? అనేదానికి వైద్యపరంగా ఇంకా ఆధారాలు తెలియలేదు. అయితే కనెక్షన్ మాత్రం ఉంది. పంటి(పెరియోడాన్టైటిస్) వ్యాధుల బారినపడిన వారందరికీ మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. దంత సంబంధ వ్యాధులు ఉన్నవారిలో డెంటిస్ట్ చేత పళ్లను క్లీన్ చేయించిన తర్వాత టెస్టులు చేస్తే, డయాబెటిస్ రిస్క్ సగానికి సగం తగ్గినట్లుగా పరిశీలనలు చెబుతున్నాయి. అందుకే డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే పంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.
దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు: ఇన్ఫెక్షన్లు తరచూ బాధిస్తే మధుమేహం వస్తుంది. ముఖ్యంగా చర్మవ్యాధులైన ఫంగస్, గజ్జి, తామర వంటి వాటి వల్ల పాంక్రియాస్లోని బీటా కణాలు పాడైపోయి మధుమేహం వస్తుంది. సాధారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ దాడిచేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో ఎక్కువగా గమనిస్తుంటాం. అందుకని చర్మవ్యాధులు అంటే ఒంటిపై చిన్న చిన్న కురుపులు కనిపించినా డాక్టర్ని సంప్రదించి తగిన యాంటీబయాటిక్స్ వాడాలి.
మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లు: జననేంద్రియాలకు సంబంధించిన శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు అధికంగా కనిపిస్తుంటాయి. పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. మగపిల్లల్లో అంగంపై తెల్లని పొడలా కనిపిస్తుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మూత్రద్వారం సగం మూసుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల పదే పదే ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఆడపిల్లల్లో అయితే రజస్వల అయిన నాటి నుంచి శుభ్రతకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కల్పించాలి. లేదంటే వీరిలోనూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి, తద్వారా డయాబెటిస్కి దారితీసే అవకాశాలు ఎక్కువ.
వైరల్ ఇన్ఫెక్షన్లు: చికెన్గున్యా, మలేరియా, టైఫాయిడ్... వంటి వైరల్ ఫీవర్ల మూలంగా ప్రతి ఏడాది ఎంతో మంది బాధపడుతున్నారు. వీటి నివారణకు డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే వీటి వల్ల పదే పదే బాధపడేవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
నులిపురుగులు: ఆహారం ద్వారా పొట్టలోకి చేరిన బ్యాక్టీరియా, కడుపులో ఏర్పడే పురుగులు ఉదరకోశ సమస్యలకు కారణాలు అవుతుంటాయి. నులిపురుగుల సమస్య పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. నులిపురుగులకంటే ఆస్కారియాసిస్ అనే పురుగులు ఇంకా పెద్దగా ఉంటాయి. ఇవి పాంక్రియాస్ డక్ట్కు అడ్డం పడటంతో ఆ గ్రంథి నుంచి వెలువడే స్రావాలు ఆగిపోతాయి. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. అందుకని కడుపులో నులిపురుగులు ఉంటే ఎక్కువ రోజులు ఆగకుండా తగిన చికిత్స తీసుకోవాలి.
మానసిక ఒత్తిడి
ఈ మధ్యకాలంలో సామాజికంగా, వ్యక్తిగతంగా పనుల్లో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్ట్రెస్ హార్మోన్లు అన్నీ కూడా ఇన్సులిన్కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఉదాహరణకు కార్టిజాల్స్, ఎడ్రిలిన్, థైరాక్సిన్, గ్రోత్హార్మోన్... లాంటివి. మనలో కోపం, బాధ, ఉద్వేగం, భయాలకు లోనైనప్పుడు గుండెదడ, మెదడు బండబారిపోవడం, బి.పి పెరగడం లేదా పడిపోవడం, తల భారంగా అనిపించడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ఈ ఒత్తిడి ఏదో ఒక రోజు కాకుండా, రోజూ ఎదుర్కుంటూ ఉంటే హార్మోన్ల పనితీరు మందగించి, ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అయినా ఆ మోతాదు శరీరానికి సరిపోదు. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. దాదాపుగా డయాబెటిస్ రావడానికి 70 శాతం మానసిక ఒత్తిడే ప్రధాన కారణం. అందుకే మానసిక ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. స్ట్రెస్ని మొదట్లోనే ఆధునికవైద్యపరంగా కాకుండా యోగా, మెడిటేషన్, లాఫింగ్, రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు.
డయాబెటిస్ ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మధుమేహం ఉన్నప్పుడు ఆహార నియమాలు పాటించడంతో పాటు ఇతరత్రా ఆరోగ్య విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
- పంటి జబ్బులు: రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవారికి పంటిపై గారను శుభ్రపరిస్తే ఆ మరుసటి రోజుకి రక్తంలో గ్లూకోజ్ 50 శాతం తగ్గినట్టుగా చాలా సందర్భాల్లో తెలిసింది. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే వీరు పంటి సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మౌత్వాష్లను రోజుకు నాలుగైదు సార్లు ఉపయోగించాలి.
- ఇన్ఫెక్షన్లు:
- చర్మవ్యాధులు: చర్మంపై చిన్న చిన్న పొక్కులు వంటివి సాధారణంగా వస్తుంటాయి. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి నయం కావడానికి తగిన యాంటీబయాటిక్స్ను వాడాలి. రోజూ షుగర్ మాత్రలు, ఇన్సులిన్ తీసుకునే వారు చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడాలి.
- మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు: మూత్రం ఆగి ఆగి రావడం, విసర్జనలో మంట, దురద వంటివి చూసినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలి.
- శుభ్రత:
- సాధారణంగా మన దేశంలో ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు తప్ప, మామూలుగా చెప్పుల వాడకం చాలా తక్కువ. దీని వల్ల కాలిగోళ్లు, కాలివేళ్ల మధ్య, పగుళ్ల మధ్య మురికి చేరి ఒక్కోసారి శాశ్వతంగా ఉండిపోతుంటుంది. వీటి వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ సమయానికి నొప్పి, జ్వరం, మంట అనిపించకపోవచ్చు. కాని కాళ్లు, చేతుల అశుభ్రత మధుమేహానికి ప్రధాన కారణం. అందుకని ఒక టబ్లో కొద్దిగా యాంటిసెప్టిక్ లోషన్ కలిపిన నీటిలో ఉదయం, సాయంత్రం పాదాలు పది, పదిహేను నిమిషాలు ఉంచి, శుభ్రపరిచి, ఆ తర్వాత తేమ లేకుండా తుడుచుకోవాలి. కాటన్ సాక్స్ వాడుతూ, చెమట పట్టకుండా చూసుకుంటే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే ముక్కు, చెవులు, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు తగిన యాంటీబయాటిక్స్ వాడాలి. కొందరికి తలపై మాడు నుంచి చుండ్రు రాలుతుంటుంది. దీనికీ తగిన మందులు వాడాలి.
మరిన్ని జాగ్రత్తలు: ఒత్తిడి తగ్గడానికి హార్ట్రేట్ను పెంచే ఫోన్, టీవీ.. వంటివి అతిగా వాడకూడదు.
లేట్గా నిద్రపోవడాలు, లేట్గా లేవడాలు చేయకూడదు. నిద్రకు కచ్చితమైన సమయం పాటించినవారిలో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
వేళకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్గా డాక్టర్చే చెకప్స్చేయిస్తూ, వారి సూచనలు పాటిస్తుంటే మధుమేహాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు.
ప్రొ॥ పి.వి.రావు
ఎండోక్రైనాలజిస్ట్,
నిమ్స్, హైదరాబాద్
ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్
ప్రీ డయాబెటిస్ ఉందని చెప్పటానికి 5 సూచనలు
మీరు డయాబెటిస్ కొరకు చెక్ చేయించుకున్నప్పుడు లేదని తెలిస్తే సెలబ్రేట్ చేసుకోండి. కానీ మీకు ప్రీడయాబెటస్ కలిగి ఉంటే? అవును,మీ రక్తంలో గ్లూకోజ్ ఉండాల్సిన దాని కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రీ డయాబెటిస్ గా నిర్దారణ అవుతుంది. కానీ అది ఎక్కువ కాదు. అయితే దానిని డయాబెటిస్ అని పిలుస్తారు.
భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రీ డయాబెటిస్ బారిన పడిన వారు ఉన్నారు. కానీ వారిలో చాలా మందికి వారి సమస్య గురించి తెలియదు. ప్రీ డయాబెటిస్ లో ఎక్కువగా ఎటువంటి లక్షణాలు కనపడవు. మీకు వ్యాధి ఉందో లేదో గుర్తించటానికి సహాయపడే కొన్ని సూచనలు ఉన్నాయి.
టైప్ 2 మధుమేహం హై - రిస్క్ గ్రూప్ లో ఉంది;
మీకు మధుమేహం యొక్క కుటుంబ చరిత్ర కలిగి ఉండటం, ఒక నిశ్చల జీవనశైలి కలిగి ఉండటం,మీ వయస్సు 45 సంవత్సరాలు ఉండటం,ఆసియా,ఆఫ్రికా లేదా హిస్పానిక్ నేపథ్యం కలిగి ఉండటం వలన రావచ్చు.
అధిక బరువు ఉండటం:
స్థూలకాయం అనేది ప్రీ డయాబెటస్ కొరకు భారీ ట్రిగ్గర్ గా ఉంది.మీ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 ఉంటే,అది ఖచ్చితంగా ఎక్కువ బ్లడ్ షుగర్ ను సూచిస్తుంది. ఊబకాయం లేదా అధిక బరువు వలన అధిక రక్తపోటు,అధిక కొలెస్ట్రాల్,గుండె వ్యాధి లేదా పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ వంటివి కూడా వస్తాయి.
క్లాసిక్ డయాబెటిస్ లక్షణాలు కలిగి ఉండటం:
ప్రీ డయాబెటిస్ భయపెట్టే విధంగా ఉంటుంది. అనేక మందిలో ప్రీ డయాబెటిస్ సంబందించిన ఎటువంటి లక్షణాలు కనపడవు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మాత్రం చెప్పలేనంత అలసట ఉంటుంది. అలాగే తరచుగా దాహం అవటం మరియు ముత్ర విసర్జనకు వెళ్ళటం జరుగుతుంది.
మీ చర్మంపై నల్లని పాచెస్:
ప్రీడయాబెటస్ వ్యక్తులలో భాహ్య చర్మపొర దళసరి అగుట వంటి సాధారణ లక్షణం కనపడుతుంది. మీ శరీర ప్రాంతాల్లో అక్కడక్కడ చర్మం ముడతలు,వింతగా ఉండుట,నల్లని మరియు మందపాటి పాచెస్ చూడవచ్చు. ఎక్కువగా ఈ పరిస్థితి మోకాలు వెనుక మరియు పిడికిలి,మోచేతుల లోపల,మెడ మీద కనిపిస్తుంది.
నిద్ర లేమి :
మీరు నిద్ర లేమితో బాధపడుతున్నారా? అయితే మీకు ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని స్టడీస్ ప్రకారం రోజూ ఆరు గంటల కంటే తక్కువ నిద్ర పోయే వ్యక్తులలో ప్రీడయాబెటస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నాడీ వ్యవస్థ మరియు నిద్ర బలహీనత మధ్య హార్మోన్ల సంబంధాల ఫలితంగా కూడా ఏర్పడవచ్చు.
ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం